పట్టాలపై గ్యాస్ సిలిండర్, పక్కనే పేలుడు పదార్థాలు.. ఢీకొట్టిన రైలు.. తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
  • లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు
  • ట్రాక్‌పై సిలిండర్‌తోపాటు పెట్రోలు బాటిల్, అగ్గిపెట్టెలు
  • విచారణ ప్రారంభించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని ముదేరి గ్రామంలో నిన్న ఉదయం రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్ పెట్టారు. గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో రైలు సరిగ్గా అక్కడికొచ్చి దానిని ఢీకొట్టి ఆగింది. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని రైల్వే అధికారులు తెలిపారు. 

నిన్న ఉదయం 8.20 గంటల సమయంలో జరిగిందీ ఘటన. రైలు హర్యానాలోని భివానీ వెళ్తుండగా శివరాజ్‌పూర్ దాటిన తర్వాత పట్టాలపై గ్యాస్ సిండర్‌ను లోకోపైలట్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. అయినప్పటికీ సిలిండర్‌ను నెమ్మదిగా ఢీకొట్టడంతో అది కిందపడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో రైలు దాదాపు 20 నిమిషాలపాటు అక్కడ నిలిచిపోయింది. 

ఘటనా స్థలం నుంచి ఎల్పీజీ సిలిండర్‌తోపాటు పెట్రోలుతో నింపిన ఓ బాటిల్‌, అగ్గిపెట్టెలు, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాటిల్‌ను పెట్రోలు బాంబులా ఉపయోగించాలని అగంతుకులు భావించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

LPG Cylinder
Prayagraj-Bhiwani Kalindi Express
Kanpur

More Telugu News